ఢిల్లీ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి ప్యానల్ స్పీకర్ హోదాలో గురువారం లోక్సభ సభాపతి విధులను నిర్వర్తించారు. ఈ సందర్భంగా ఆధార్ సవరణ బిల్లుపై చర్చ జరిగింది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సభకు హాజరు కాని సమయంలో ప్యానెల్ స్పీకర్లలో ఒకరు వారి బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. లోక్సభ స్పీకర్ ఓంబిర్లా సోమవారం ప్రకటించిన ప్యానెల్ స్పీకర్ల జాబితాలో మిథున్ రెడ్డికి చోటు లభించింది. రాజంపేట నియోజక వర్గం నుంచి ఆయన రెండు సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. 2014లో భాజపా అభ్యర్థి పురందేశ్వరిపై విజయం సాధించారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి సత్యప్రభపై 2,68,284 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.