హైదరాబాద్ : నగరంలో అదృశ్యాల కలకలం కొనసాగుతోంది. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని, ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. పటాన్చెరుకు చెందిన ఇద్దరు విద్యార్థినులు స్థానిక ఇంటర్ జూనియర్ కళాశాలలో చదువుతున్నారు. మంగళవారం ఉదయం ఇద్దరూ కళాశాలకు వెళుతున్నామని చెప్పి తిరిగి రాలేదు. వారి తల్లిదండ్రులు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరో సంఘటనలో పటాన్చెరులోని కృషి డిఫెన్స్ కాలనీకి చెందిన శివాని అనే ఉద్యోగిని అదృశ్యమైంది. మంగళవారం రాత్రి ఆమెను స్నేహితుడు కాలనీలో దింపి వెళ్లినట్లు సీసీ ఫుటేజీలున్నాయి. రాత్రి నుంచి తన కుమార్తె కనిపించడం లేదని శివాని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఒకటో తేది నుంచి పది వరకు సుమారు 540 మందికి పైగా అదృశ్యమయ్యారు. వీరిలో 220 మంది ఎటు వెళ్లారో పోలీసులు గుర్తించగలిగారు. ఇంకా 318 కేసుల్లో గుర్తించాల్సి ఉంది. 270 మందికి పైగా మహిళలు అదృశ్యమయ్యారు.