చండీగఢ్: బాకీ తీర్చలేదని ఓ మహిళ పట్ల రాజకీయనేత కుటుంబ సభ్యుడు అమానుషంగా ప్రవర్తించటం సామాజికమాధ్యమాల్లో సంచలనమైంది. ముక్తసర్ మున్సిపల్ కౌన్సిలర్, కాంగ్రెస్ నేత రాకేశ్ చౌదరి సోదరుడు సురేశ్ వద్ద మీనా రాణి అనే మహిళ రూ. 23వేలు అప్పుగా తీసుకుంది. చెప్పిన సమయానికి ఆ డబ్బులు తిరిగి చెల్లించలేకపోవటంతో సురేశ్ తన అనుచరులతో కలిసి మీనారాణి ఇంటికి వెళ్లి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఆమెను ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి పిడిగుద్దులు గుద్దాడు. బెల్టులు, కర్రలతో దాడి చేశాడు. అడ్డొచ్చిన మీనా తల్లిపై కూడా చేయిచేసుకున్నాడు. ఇదంతా చూసి మీనా ఐదేళ్ల కుమారుడు గుక్కపట్టి ఏడుస్తున్నా అతడి మనసు చలించలేదు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మీనా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు సురేశ్ చౌదరి, అతడి అనుచరులను అరెస్టు చేశారు. కౌన్సిలర్ రాకేశ్ చౌదరిపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.