హైదరాబాద్ : మధుమేహం, క్యాన్సర్, గుండె సంబంధిత దీర్ఘకాలిక ఔషధాలన్నీ చౌక ధరలకే లభించనున్నాయి. ఆయా మందుల తయారీకి అవసరమైన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ)ను హైదరాబాద్లోని ఐఐసీటీ అభివృద్ధి చేయనుంది. స్థానిక రసాయనాలు, వనరులతో అభివృద్ధి చేసిన ఏపీఐలతో తుది ఔషధ తయారీ ఖర్చు తగ్గుతుందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) డైరెక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ వెల్లడించారు. ఇప్పటికే 53 రకాల దీర్ఘకాలిక ఔషధాల ఏపీఐలకు కేంద్రం ఓకే చెప్పిందని తెలిపారు. తొలి దశలో కరోనా వైరస్ నియంత్రణ మందుల ఏపీఐలను అభివృద్ధి చేస్తున్నామని, వచ్చే 3 నెలల్లో వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు.