లోక్సభ ఎన్నికల్లో పొరపాటున నాలుగు సీట్లు గెలవగానే బీజేపీకి కొమ్ములొచ్చాయని బీజేపీ నేతలకు భూమిపై కాళ్లు నిలవడం లేదంటూ తెరాస కార్యాధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు.త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో తెరాస క్లీన్వస్వీప్ చేస్తుందని ఎక్కడైనా కొన్ని చోట్ల మాత్రం రెండో స్థానంలో బీజేపీ లేదా కాంగ్రెస్ నిలిచే అవకాశాలు ఉన్నాయన్నారు.తెలంగాణలో కాంగ్రెస్-బీజేపీల పరిస్థితి గమనించి ఆయా పార్టీల నేతలు పూర్తిగా నైరాశ్యంలో కూరుకుపోయారన్నారు.కాంగ్రెస్కు ఏఐసీసీ అధ్యక్షుడు లేనట్లే తెలంగాణలో టీపీసీసీ అధ్యక్షుడు కూడా లేడని బీజేపీ పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదన్నారు.లోక్సభ ఎన్నికల్లో పొరపాటుగా నాలుగు సీట్లు గెలుచుకోగానే బీజేపీ నేతలు తెలంగాణలో తమకు బలం వచ్చేసినట్లు భావిస్తూ ఊహాలోకంలో విహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కేవలం 8 జడ్పీటీసీ స్థానాలను మాత్రమే గెలుచుకొందని గుర్తు చేశారు.కొత్త శాసనసభ, సచివాలయం నిర్మాణం విషయంలో కేసు కోర్టులో ఉందని ఈ విషయమై కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందో చూద్దామన్నారు. జర్నలిస్టుల సమస్యను పరిష్కరించే బాధ్యతను తాను తీసుకొంటానని హామీ ఇచ్చిన కేటీఆర్ గవర్నర్ ను మార్చే విషయం తనకు సమాచారం లేదన్నారు..