చెన్నై: ‘భారతీయుడు-2’ సెట్లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు కమల్ హాసన్ ఆర్థికసాయం ప్రకటించారు. ఆయన కథానాయకుడిగా శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘భారతీయుడు- సినిమా షూటింగ్లో చెన్నైలో జరుగుతోంది. చిత్రీకరణలో భాగంగా చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో లైటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్న సందర్భంలో బుధవారం రాత్రి 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్ తెగి చిత్ర బృందం ఉండే టెంట్పై పడింది. ఈ ఘటనలో శంకర్ వ్యక్తిగత సహాయకుడు మధు(29), అసిస్టెంట్ డైరెక్టర్ సాయికృష్ణ(34), సహాయకుడు చంద్రన్ మృతిచెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి. స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను తాజాగా కమల్ హాసన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘సినీ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్లకి రక్షణ ఎంతటి ప్రశ్నార్థకంగా ఉంటుందో ఈ ప్రమాదం తెలియచేస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకునే విధంగా ఈ రోజు ఉదయం నేను ఇండస్ట్రీలోని నా స్నేహితులతో మాట్లాడాను. ఎన్నో కోట్ల బడ్జెట్తో సినిమా రూపొందుతుందని గర్వంగా చెప్పుకుంటున్నాం.. కానీ సినిమా కోసం పనిచేసే వాళ్లకి సరైన రక్షణ ఇవ్వలేకపోతున్నామని వ్యక్తిగతంగా సిగ్గుపడుతున్నాను’నిన్న రాత్రి జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు నా తరఫు నుంచి రూ.కోటిని ఆర్థికసాయంగా అందిస్తాను. ఇది నష్టపరిహారం కాదు. మృతిచెందిన వారు నిరుపేద కుటుంబాలకు చెందినవారు. మూడేళ్ల క్రితం నాకు యాక్సిడెంట్ జరిగింది. కుటుంబంలోని కీలకమైన వ్యక్తికి ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబం జీవనం సాగించడం ఎంత కష్టంగా ఉంటుందో నాకు బాగా తెలుసు’అని కమల్ తెలిపారు.