అంద‌ని వైద్య‌బీమా

అంద‌ని వైద్య‌బీమా

న్యూఢిల్లీ: 2018 నాటికి పట్టణాలలో 19.1శాతం, గ్రామాలలో 14.1శాతం మందికి మాత్రమే వైద్య బీమా ఉంది. అంటే 80శాతానికి పైగా ప్రజలు ఆస్పత్రి బిల్లులు చెల్లించాల్సిందే. దీనిని దృష్టిలో ఉంచుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం 2018లో ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (పీఎంజేఏవై) పథకాన్ని ప్రారంభించింది. దేశంలోని 15.5 కోట్ల పేద కుటుంబాలకు ఆస్పత్రి సేవలను అందించే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఆదాయం, ఆస్తుల దృష్ట్యా దేశ జనాభాలో చివరి స్థానంలో ఉన్న 60 కోట్ల మంది లబ్దిదారులకు దీని ద్వారా ప్రయోజనం చేకూర్చడం లక్ష్యం. ఈ పథకం కింద సంవత్సరానికి ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల రూపాయల వరకూ వైద్య బీమా కవరేజీ లభిస్తుంది. ప్రపంచంలో ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఆరోగ్య బీమా పథకాలలో ఇదే అతి పెద్దది. ఆశయం మంచిదే అయినా ఆచరణలో మాత్రం ఈ పథకం ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతోంది.
40 కోట్ల మందికి బీమా లేదు
ఔట్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్న 40 నుండి 80 శాతం మందికి ఈ పథకం వర్తించడం లేదు. ఈ పథకం కింద చాలా రాష్ట్రాలలో వైద్యానికి అయ్యే ఖర్చులో 60 శాతం వరకూ కేంద్రమే భరించాల్సి ఉంటుంది. వాస్తవానికి కేంద్రం చెల్లిస్తున్న వైద్య ఖర్చులు చాలా తక్కువగానే ఉంటున్నాయి. రాష్ట్రాలపైనే భారం ఎక్కువగా పడుతోంది. ఈ పథకాన్ని ఆర్భాటంగా ప్రారంభించినప్పటికీ ఇంకా 40 కోట్ల మందికి వైద్య బీమా లభించపోవడం గమనార్హం.
కేంద్రం ఇచ్చింది 28శాతం మాత్రమే
ఈ పథకం ప్రస్తుతం 23 రాష్ట్రాలలో అమలవుతోంది. రాష్ట్ర స్థాయిలో తమకు వేరే ఆరోగ్య బీమా పథకాలు ఉన్నాయన్న కారణం తో పశ్చిమ బెంగాల్, ఒడిషా, ఢిల్లీ రాష్ట్రాలు ఇందులో చేరలేదు. బడ్జెట్ ప్రకారం 2019 నుండి 2023-24 వరకూ కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద ఆస్పత్రి అడ్మిషన్ల కోసం రూ. 23,575.89 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి రూ.15,712, 26 కోట్లు సమకూర్చాయని అంచనా. అయితే ప్రభుత్వ గణాంకాలు మరోలా ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 2వ తేదీ నాటికి ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం రూ.80,000 కోట్లు ఖర్చు చేశామని పీఎంజేఏవై డాష్బోర్డు తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించిన ప్రీమియం కంటే ఇది రెండు రెట్లు అదనం. మొత్తం వ్యయం రూ.80,000 కోట్లలో కేంద్రం ఇచ్చింది రూ.23,575 అయితే మిగిలింది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు భరించినట్లే కదా. దీనిని బట్టి అర్థమవుతోంది ఏమంటే పీఎంజేఏవై కింద రాష్ట్రాలు 72శాతం సమకూర్చితే కేంద్రం విదిల్చింది కేవలం 28శాతం మాత్రమే.
లబ్దిదారుల ఎంపిక రాష్ట్రాలదే
ఆరోగ్యం అనేది రాష్ట్రాలకు సంబంధించిన అంశమే. అందులో సందేహం ఏమీ లేదు. అయితే ఇప్పటికే నిధుల పంపిణీ విషయంలో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య ఆర్థికపరమైన సమస్యలు, వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పీఎంజేఏవై పథకం రాష్ట్రాలపై మరింత ఆర్థిక భారాన్ని మోపుతోంది. పథకంలో ఎంతమంది లబ్దిదారులనైనా రాష్ట్రాలు చేర్చవచ్చు. ఇందులో కేంద్రం ప్రమేయం ఉండదు. లబ్దిదారుల ఎంపిక విషయంలో రాష్ట్రాలు వేర్వేరు సమాచారాలను పరిగణనలోకి తీసుకున్నాయి. ఇరవై రాష్ట్రాలు 2011 నాటి జనగణన లేదా ఎస్ఈసీసీ వివరాలను ఆధారంగా చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు తమ పౌర సరఫరాల విభాగాలు అందించిన సమాచారంపై ఆధారపడ్డాయి. జార్ఖండ్ వంటి కొన్ని రాష్ట్రాలు ప్రజా పంపిణీ వ్యవస్థ గణాంకాలను ప్రామాణికంగా తీసుకున్నాయి.
పుదుచ్చేరి, ఉత్తరాఖండ్, లఢక్ వంటి కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కేంద్రం నిర్దేశించిన లక్ష్యాల కంటే ఒకటిన్నర రెట్లు అధికంగా లబ్దిదారులను ఎంపిక చేశాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా వంటి రాష్ట్రాలు లక్ష్యాల కంటే 25శాతం అదనంగా లబ్దిదారులను ఎంపిక చేసుకున్నాయి. చాలా రాష్ట్రాలు మాత్రం లక్ష్యాలకు అనుగుణంగానే వ్యవహరించాయి. ఇంకొన్ని రాష్ట్రాలు తమకు లక్ష్యంగా నిర్దేశించిన లబ్దిదారుల సంఖ్యలో 32-80 శాతం మందిని మాత్రమే ఎంపిక చేశాయి.
కార్డుల జారీలో…
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ పథకానికి విశేష ప్రాచుర్యం కల్పించి పేదలు, మధ్య తరగతి ఓటర్లను ఆకర్షించాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో పీఎంజేఏవై కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. అయితే చాలా రాష్ట్రాలు మాత్రం దీనిపై పెద్దగా ముందడుగు వేయడం లేదు. 19 రాష్ట్రాలు జాతీయ స్థాయి (57.46శాతం) కంటే ఎక్కువగా 31 కోట్ల కార్డులు జారీ చేశాయి. 14 రాష్ట్రాలు జాతీయ స్థాయి కంటే తక్కువగానే కార్డులు ఇచ్చాయి. వీటిలో కేరళ, తమిళనాడు, కర్నాటక ఉన్నాయి. రాష్ట్ర స్థాయి పథకాలలో ఎక్కువ మంది లబ్దిదారులను చేర్చిన ప్రభుత్వాలు, పీఎంజేఏవై లక్ష్యం కంటే తక్కువగానే కార్డులు జారీ చేశాయి. బీహార్ రాష్ట్రంలో కేవలం లక్ష్యంలో 13శాతం మాత్రమే కార్డులు జారీ అయ్యాయి.
అందుబాటులో
సుమారు 30 వేల ఆస్పత్రులు
పీఎంజేఏవై పథకం కింద వైద్య సేవలు పొందడానికి 17,135 ప్రభుత్వ, 12,626 ప్రైవేటు (మొత్తం 29,761) ఆస్పత్రులను ఎంపిక చేశారు. ఈ పథకం కింద ప్రతి వెయ్యి మంది లబ్దిదారుల్లో సగటున సుమారు 160 మంది వైద్య సేవలు పొందుతున్నారు. అయితే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, తెలంగాణ వంటి పెద్ద రాష్ట్రాల్లో వైద్య సేవలు పొందుతున్న వారి సంఖ్య జాతీయ సగటు (ప్రతి వెయ్యి మందికి 29 మంది) కంటే తక్కువగా ఉంది. ప్రజల్లో అవగాహన కల్పించకపోవడమే దీనికి కారణంగా చెప్పవచ్చు. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయమేమంటే పురుషుల తో పోలిస్తే మహిళలు తక్కువ సంఖ్యలో ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos