టీ20 క్రికెట్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. ఒక రనౌట్ వల్లో లేక ఒక క్యాచ్ను జారవిడవడం వల్లో మ్యాచ్ ఓడిపోయామని చెప్పుకుంటే సిగ్గుచేటే అవుతుంది. మొత్తం మ్యాచ్ను లెక్కలోకి తీసుకుని వైఫల్యంపై విశ్లేషించుకోవాలి. అలాంటిది గురువారం జరిగిన ప్రపంచ కప్ టీ20 రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్ ఓడిపోవడానికి హసన్ అలీ విడిచిపెట్టిన ఒక క్యాచే కారణమని పాక్ దురభిమానులు అతనిని ఎండగట్టడం వారి అవగాహనారాహిత్యాన్ని చాటి చెబుతోంది.
టీ20 ప్రపంచకప్-2021 సూపర్-12లో వరుసగా ఐదు మ్యాచులు గెలిచి, అజేయ జట్టుగా సెమీస్కు దూసుకొచ్చిన పాకిస్థాన్కు నవంబర్ 10న ఆసీస్తో జరిగిన సెమీస్లో శృంగ భంగమైంది. పాక్ 5 వికెట్ల తేడాతో ఆసీస్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచులో ఆఖరి వరకు పాక్కు తిరుగులేదనిపించినా, వేడ్, స్టొయినిస్లు మ్యాచ్ తీరునే మార్చేశారు. షాహీన్ ఆఫ్రిది వేసిన 19వ ఓవర్ మూడో బంతికి మాథ్యూ వేడ్ ఇచ్చిన క్యాచ్ను బౌండరీ లైన్ దగ్గర హసన్ ఆలీ జారవిడిచాడు. ఆ తర్వాత వరుసగా మూడు సిక్సర్లు బాదిన వేడ్.. మరో ఓవర్ మిగిలుండగానే మ్యాచును ముగించి ఆసీస్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
ఈ నేపథ్యంలో హసన్ అలీ.. గతంలో(పాక్ చేతిలో భారత్ ఓడిన సందర్భంగా) టీమిండియా ఆటగాళ్లు మహ్మద్ షమీ, విరాట్ కోహ్లిల మాదిరే దారుణంగా ట్రోలింగ్కు గురయ్యాడు. ఓ రకంగా చెప్పాలంటే ఈ ట్రోలింగ్ మరింత శృతి మించిపోయింది. పాక్ ఓటమిని జీర్ణించుకోలేని ఆ దేశ అభిమానులు.. భారతీయురాలైన హసన్ అలీ భార్యని, ఆమె కుటుంబ సభ్యులను బూతులు తిడుతూ తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు.
మరోవైపు, హసన్ ఆలీ కీలక సమయంలో క్యాచ్ డ్రాప్ చేయడమే మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అని స్వయానా పాక్ కెప్టెనే అభిప్రాయపడడంతో జట్టు సభ్యులెవరూ అతనికి మద్దతుగా నిలిచే ధైర్యం చేయలేకపోతున్నారు. అయితే, హసన్ అలీపై జరుగుతున్న ఈ ఆన్లైన్ దాడిని భారత నెటిజన్లు మాత్రం ఖండిస్తున్నారు. హసన్ ఆలీకి భరోసా ఇస్తూ ‘IND stand with Hasan Ali’ అనే హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. కాగా, భారత్కు చెందిన సమీయా అర్జోని హసన్ అలీ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సమీయా అర్జోతో పాటు సెమీస్లో ఒక్క పరుగుకే ఔటైన షోయబ్ మాలిక్ భార్య సానియా మీర్జాను సైతం పాక్ అభిమానులు టార్గెట్ చేస్తున్నారు.