హొసూరు : ఫిబ్రవరి రెండవ వారంలోనే ఎండలు ఎక్కువ కావడంతో పట్టణంలో పళ్ళ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. హొసూరు చల్లని ప్రదేశం. పెద్ద పారిశ్రామికవాడగా ఎదిగింది. అక్టోబరు నుంచి ఫిబ్రవరి చివరి వరకు చలి ఎక్కువగా ఉండేది. గత ఏడాది వర్షాలు తక్కువగా కురవడంతో చలి తగ్గిపోయి, ఎండ తీవ్రత ఎక్కువైంది. వేడి తాపాన్ని తగ్గించుకునేందుకు ప్రజలు వివిధ రకాల పండ్ల రసాలు, పళ్ళు సేవిస్తున్నారు. వేడి తగ్గించే కర్బూజా పళ్ళకు గిరాకీ పెరగడంతో పండ్ల వ్యాపారులు కర్బూజ పండ్లను ఇతర ప్రాంతాల నుంచి తెప్పించి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం కర్బూజా ధర రూ.25 పలుకుతోంది. మార్చి చివరి వారంలో కర్బూజా ఎక్కువగా మార్కెట్కు వచ్చే అవకాశం ఉందని, అంతవరకు ధరలు ఇలాగే ఉంటాయని వ్యాపారులు తెలిపారు. గిరాకీ పెరగడంతో పట్టణంలోని ప్రధాన రోడ్లలో కర్బూజా విక్రయ కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి.