సిద్ధిపేట : చింతమడక గడ్డపై పుట్టడం తన అదృష్టమని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు అన్నారు. ముఖ్యమంత్రితో పాటు ఆయన భార్య శోభారాణి, కుమారుడు కేటీఆర్ ఇతర కుటుంబ సభ్యులు సోమవారం స్వగ్రామంలో పర్యటించారు ఈ సందర్భంగా సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆయన గ్రామస్థులతో ఆత్మీయ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనను ఇంతటివాడిని చేసిన చింతమడక గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపారు. చింతమడకను చింతలు లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. మూడు, నాలుగు నెలల్లో అభివృద్ధి పనులు పూర్తవ్వాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్థులదరికీ వైద్య పరీక్షలు చేయిస్తామని, వైద్యానికి కావాల్సిన ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. చింతమడక నుంచే ఆరోగ్య సూచిక తయారీకి నాంది పలకాలన్నారు.