సరికొత్త పద్ధతి ద్వారా కేన్సర్ను నివారించే అవకాశం ఉందని బ్రిటన్
పరిశోధకులు వెల్లడించారు. సాధారణంగా శరీరంలో కణ విభజన అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇది అన్ని భాగాల్లో జరగదు. మెదడు, గుండె, మూత్ర పిండాల వంటి కొన్ని అవయవాల్లో మనిషి పుట్టినప్పుడు ఎన్ని కణాలు ఉంటాయో మరణించే వరకు దాదాపుగా అంతే ఉంటాయి. ఇక పేగు గోడల్లో రెండు, మూడు వారాలకు ఒకసారి కొత్త కణాలు పుట్టుకొచ్చి పాతవి చనిపోతుంటాయి. జన్యువులో వచ్చే మార్పుల వల్ల కొన్ని కణాలు చనిపోకుండా నిరంతరం విభజన చెందుతూ ఉంటాయి. వీటివల్లే కణతులు ఏర్పడతాయి. ఇవే కేన్సర్ కణాలు. వీటిని సర్జరీ ద్వారా తొలగించే అవకాశం లేదు. కాబట్టే కీమోథెరపీ, రేడియేషన్ చికిత్సతో కణాల విచ్ఛత్తి జరగకుం డా అడ్డుకుంటున్నా.. పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కావడం లేదు. అందుకే
95-98 శాతం కేన్సర్ నివారణ మందులు ఫేజ్-3
క్లినికల్ ట్రయల్స్లో చతికిలపడుతున్నాయి. అన్ని మందులు దాదాపుగా బల్క్ కేన్సర్ కణాలనే లక్ష్యం చేసుకోవడం వల్లే ఈ సమస్య. యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్, సాల్ఫోర్డ్ పరిశోధకులు తొలిసారి కేన్సర్ మూల కణాలను గుర్తించారు. వీటి వల్లే ఇష్టానుసారంగా కణ విచ్ఛత్తి జరిగి కణతులు ఏర్పడుతున్నాయని తేల్చారు. ఇప్పుడు ఈ మూల కణాలను లక్ష్యం గా చేసుకుని కొత్త చికిత్స అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా రొమ్ము కేన్సర్ బాధితుల్లో ప్రయోగాత్మకంగా కేన్సర్ మూల కణాలను వేరు చేశారు. సాధారణ కేన్సర్ కణాలతో పోలిస్తే
0.2 శాతం కణాలకు ప్రత్యేక లక్షణాలు ఉన్నాయని, అవి ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేసి, వేగంగా పెరుగుతున్నాయని గుర్తించారు. ఇప్పటికే రిబోసిక్లిబ్ అనే మందును ఉపయోగించి కణాల విచ్ఛత్తి జరకుండా నియంత్రించ గలిగారు. భవిష్యత్తులో ఈ తరహా పద్ధతులను మరింత అభివృద్ధి చేయడం ద్వారా మధుమేహం తరహాలోనే చికిత్స అందించే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు.