అమరావతి : కేంద్ర బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అభివృద్ధికి, పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసిందని, ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలను పూర్తిగా విస్మరించారని నిష్టూరమాడారు. తొలి ఏడాది ఆర్థిక లోటు భర్తీని ఇంకా తేల్చలేదని, రూ.16 వేల కోట్ల లోటుకు గాను రూ.4 వేల కోట్లే ఇచ్చారని విమర్శించారు. ఐఐటీ, నిట్, ఐఐఎం, ట్రిపుల్ ఐటీ, ఐజర్ సంస్థలకు ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు కేటాయింపులు లేవని విమర్శించారు. విశాఖ, విజయవాడ మెట్రో, కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టుల గురించిన ప్రస్తావనే లేదని దుయ్యబట్టారు.