శాసనసభలో ఫర్నీచర్ను దారి మళ్లించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ స్పీకర్,తెదేపా సీనియర్ నేత కోడెల శివప్రసాదరావుపై తాజాగా మరో కేసు నమోదైంది.గతంలో హైదరాబాద్ నుంచి వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఫర్నీచర్ తరలిస్తున్న సమయంలో అప్పటి స్పీకర్గా ఉన్న తాను కొంత ఫర్నీచర్ను ఉపయోగించుకున్నట్లు కొద్ది రోజుల క్రితం కోడెల స్వయంగా ప్రకటించారు.అసెంబ్లీ ఫర్నీచర్ విషయంలో ఈ నెల 23వ తేదీన గుంటూరులోని కోడెల శివరామ్ షోరూమ్లో అసెంబ్లీ అధికారులు తనిఖీలు చేశారు.తమ వద్ద ఉన్న జాబితాతో పాటు కోడెల శివప్రసాదరావు షోరూమ్ లో ఉన్న ఫర్నీచర్ విషయమై లెక్కలు తీశారు. అసెంబ్లీ సెక్షన్ అధికారి ఈశ్వరరావు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఫర్నీచర్ను దారి మళ్లించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.ఇదిలా ఉండగా గుంటూరు నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో కంప్యూటర్ల చోరీ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. కార్యాలయంలో 30 ల్యాప్టాప్లను తీసుకెళ్లారని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామ్ పై అధికారి బాజీబాబు ఈ నెల 23వ తేదీన సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.అయితే ఈ నెల 21వ తేదీన డీఆర్డీఏ కార్యాలయంలోల్యాప్టాప్లను వదిలివెళ్లినట్లు వెలుగు చూడడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ కంప్యూటర్లను డీఆర్డీఏ కార్యాలయంలోని వాచ్మెన్ కు చెప్పి ఆ ల్యాప్టాప్లను వదిలివెళ్లారు. ఈ ల్యాప్ టాప్లు లేవని కేసు నమోదైంది.ఈ సమయంలో ల్యాప్టాప్ లు డీఆర్డీఏ కార్యాలయంలో ఓ వ్యక్తి వదిలి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన డీఆర్డీఏ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. ఈ విషయమై ఆలస్యంగా అధికారులకు సమాచారం ఇచ్చిన డీఆర్డీఏ కార్యాలయ అటెండర్ను సస్పెండ్ చేశారు.