చెన్నై: కలైంజర్ డీఎంకే పేరుతో కొత్త పార్టీ స్థాపనకు దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి కసరత్తు చేస్తున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఈ నెల 20న మద్దతుదారులతో భేటీ కానున్నారు. డీఎంకే నుంచి తన పెద్ద కుమారుడు అళగిరిని కరుణానిధి గతంలో బహిష్కరించారు. కరుణానిధి అనంతరం డీఎంకేలో చేరడానికి అళగిరి ప్రయత్నాలు చేసినా స్టాలిన్ ఆసక్తి చూపలేదు. 2021 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా స్టాలిన్ ముందుకెళుతున్నారు. పార్టీలో తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కు ప్రాధాన్యత ఇవ్వడం సీనియర్లలో అసంతృప్తి రగిలినట్లు సమాచారం. రాజకీయాలకు అళగిరి దూరంగా ఉంటున్నా. నటుడు రజనీకాంత్ పార్టీ పెడితే ఆయన వెంట నడిచేందుకు అళగిరి సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం కూడా సాగింది. రజనీ పార్టీపై స్పష్టత లేకపోవడంతో బీజేపీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెల 20న మదురైలోని దయ కల్యాణ మండపంలో తన మద్దతు దారులతో భేటీ కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. దక్షిణ తమిళ నాడులో అళగిరికి అధికంగా మద్దతు ఉంది. డీఎంకే అసంతృప్తి నేతలకు రహస్యంగా పిలుపు వెళ్లడం డీఎంకేలో చీలిక దిశగా అళగిరి వ్యూహాలు ఉండవచ్చన్న చర్చ ఊపందుకుంది. కొత్త పార్టీనా లేదా బీజేపీతో జతకట్టడమా? అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది.