దిల్లీ: ఐసీసీ టీ20 ప్రపంచకప్ లీగ్ దశలో దాయాదుల పోరు లేకపోవడం అభిమానులను అత్యంత నిరాశపరిచింది. అందరినీ అలరించే, అధిక ఆదాయం తీసుకొచ్చే భారత్, పాక్ సమరం ఉంటే బాగుండేదని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇంతకీ లీగ్ దశలో ఈ మ్యాచ్ లేకపోవడానికి కారణమేంటో ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్సన్ తెలిపారు. ఐసీసీ టీ20 ర్యాంకుల్లో ప్రస్తుతం పాక్ అగ్రస్థానంలో ఉంది. భారత్ రెండో స్థానంలో ఉంది. ర్యాంకుల వారీగా గ్రూప్లు ఏర్పాటు చేయడంతో ఒకటీ, రెండు స్థానాల్లోని పాక్, భారత్ను చెరో గ్రూప్లో వేయాల్సి వచ్చిందని డేవ్ వెల్లడించారు. దాయాదులను ఒకే గ్రూప్లో ఉంచేందుకు ఎలాంటి అవకాశం దొరకలేదని ఆయన పేర్కొన్నారు. బహుశా వారు సెమీస్ లేదా ఫైనల్లో తలపడొచ్చని రిచర్డ్సన్ తెలిపారు. భారత్ 2021 ఛాంపియన్స్ ట్రోఫీ, 2023 ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను కోల్పోయే ప్రమాదం లేదని రిచర్డ్సన్ తెలిపారు. భారత్లో నిర్వహించిన 2016 టీ20 ప్రపంచకప్కు పన్ను మినహాయింపు ఇప్పించకపోతే ప్రపంచకప్ కప్ ఆతిథ్య హక్కులను రద్దు చేస్తామని వచ్చిన వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు. మినహాయింపుల అంశం తేల్చుకొనేందుకు చాలా సమయం ఉందని వెల్లడించారు. ఐసీసీకి లభించే డబ్బు పూర్తిగా క్రికెట్ అభివృద్ధికే వెచ్చిస్తారని డేవ్ గుర్తుచేశారు.