ముంబయి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్న టీమిండియా మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్ పట్ల సహచర క్రికెటర్లు సహృద్భావంతో స్పందిస్తున్నారు. ఇప్పుడు క్రికెటర్ కృనాల్ పాండ్య ఖాళీ చెక్ను పంపి తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు. బరోడా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సంజయ్ పటేల్కు బ్లాంక్ చెక్ పంపి..‘ఆయనకు ఎంత అవసరమో ఆ మొత్తాన్ని అక్కడ నింపండి. రూ.లక్ష కంటే తక్కువ మాత్రం ఉండకూడదు’ అని కృనాల్ తెలిపినట్లు ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది. రోడ్డు ప్రమాదంలో ఊపిరితిత్తులు, కాలేయం తీవ్రంగా దెబ్బతినడంతో మార్టిన్ జాకబ్ వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నాడు. అతని వైద్యం కోసం రోజుకు దాదాపు రూ.70 వేలు ఖర్చవుతున్నట్లు సమాచారం. అతడి భార్య సాయం కోరగా బీసీసీఐ వెంటనే స్పందించి రూ.5 లక్షలు అందించింది. నిన్న భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అతడి కుటుంబానికి మద్దతు ప్రకటించి, సాయం చేసిన సంగతి తెలిసిందే. ‘క్రికెటర్లు జహీర్ ఖాన్, యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, మునాఫ్ పటేల్, సౌరవ్ గంగూలీ తదితరులు జాకబ్ కుటుంబానికి సాయం చేయడానికి ముందుకు వచ్చారు’ అని సంజయ్ పటేల్ వెల్లడించారు. జాకబ్ మార్టిన్ టీమిండియా తరఫున 10 వన్డేలు ఆడాడు.