అనుకున్నది ఎట్టిపరిస్థితుల్లోనూ చేసి తీరుతాడనే తనపై ఉన్న భావనను నిజం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచనల నిర్ణయాలు తీసుకుంటున్నారు.గత ప్రభుత్వం హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై పునఃసమీక్ష చేస్తామని అవసరమైతే వాటిని మార్చేస్తామంటూ ప్రకటించిన జగన్ అందులో ముందడగు వేశారు.కేంద్ర ప్రభుత్వం వారించినా లెక్క చేయకుండా విద్యుత్ ఒప్పందాల పునఃసమీక్షకే జగన్ మొగ్గు చూపడం అందరినీ విస్మయ పరచింది.రెనివెబుట్ ఎనర్జీ డెవలపర్స్తో గత ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ)పై విచారణ జరిపించడానికి నిర్ణయించుకున్న జగన్ ప్రభుత్వం అందుకు సంబంధించి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. విండ్, సోలార్ ఎనర్జీ డెవలపర్స్ తో గత ప్రభుత్వం చేసుకున్న పిపిఎలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత చేసిన తొలి ప్రసంగంలో బహిరంగంగానే అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్కువ ధరలకు బహిరంగ మార్కెట్లో విద్యుత్తు లభ్యమవుతున్న స్థితిలో ఎక్కువ ధర పెట్టి పిపిఎలు చేసుకోవడం ఏమిటని ప్రశ్నించిన జగన్ అందుకు సంబంధించి విచారణకు కమిటి నియమించడం చర్చనీయాంశమైంది.అయితే పిపిఎల పునఃపరిశీలన,విచారణ వల్ల సంబంధిత రంగంలోని పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బ తీస్తుందని, దానివల్ల భవిష్యత్తు బిడ్స్ కు, పెట్టుబడులకు ఇబ్బంది ఏర్పడుతుందని అంటూ కొద్ది రోజుల క్రితం కేంద్ర రెనివెబుల్ ఎనర్జీ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యానికి లేఖ రాశారు.ఈ విషయాలన్నీ సీఎం జగన్కు అర్థమయ్యేలా చెప్పాలంటూ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యానికి సూచించింది.ఇవేమి లెక్క చేయకుండా జగన్ విచారణకే మొగ్గు చూపడం ఆసక్తికరంగా మారింది..