నేపియర్: అదే వేదిక.. అదే దేశం..అదే పరిమిత ఓవర్ల మ్యాచ్.. అదే గెలుపు.. కానీ జట్లు వేరు. నిన్న టీమిండియా పురుషుల జట్టు..నేడు టీమిండియా మహిళల జట్టు కివీస్ను ఓడించి వన్డే సిరీస్లను లాంఛనంగా ప్రారంభించాయి. గురువారం నేపియర్ వేదికగా టీమిండియా-కివీస్ మహిళా జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో మిథాలీసేన బోణీ కొట్టింది. కివీస్ జట్టు నిర్దేశించిన 192 పరుగులు లక్ష్యాన్ని టీమిండియా అలవోకగా సాధించేసింది. స్మృతి మంధాన శతకంతో ఆకట్టుకోవడంతో భారత మహిళల జట్టుకు విజయం సులువైంది. దీంతో 33 ఓవర్లలోనే టీమిండియా ఇన్నింగ్స్ను ముగించింది. మ్యాచ్ ఆరంభం నుంచి టీమిండియా కివీస్ జట్టుకు చుక్కలు చూపించింది. 32 ఓవర్ల వరకూ వికెట్ కోల్పోకుండా లక్ష్య ఛేదనలో నిమగ్నమైంది. రోడ్రిగోస్ నిలకడకు మంధాన దూకుడు తోడవ్వడంతో టీమిండియాకు విజయం నల్లేరుపై నడకలా సాగింది. ఈ క్రమంలో మంధాన శతకం పూర్తి చేసుకుంది. రోడ్రిగోస్-మంధాన జోడీ కలిసి 180 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. మ్యాచ్ను ఓపెనర్లే ముగిస్తారని అందరూ భావించారు. అయితే టీమిండియా విజయానికి మరో ఐదు పరుగులు కావల్సి ఉండగా మంధానను అమీలియా కెర్ పెవిలియన్ చేర్చింది. తర్వాత రోడ్రిగోస్ మూడు పరుగులు చేసి కివీస్ లక్ష్యాన్ని సమం చేయగా చివరి బంతిని వైడ్గా ప్రకటించడంతో టీమిండియా ఖాతాలో ఒక పరుగు చేరింది. దీంతో వికెట్ నష్టానికి టీమిండియా 33 ఓవర్లలోనే మ్యాచ్ను ముగించింది. తొమ్మిది వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. శతకంతో ఆకట్టుకున్న మంధానకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. దీంతో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.