భవన నిర్మాణ కార్మికుల కోసం లాంగ్మార్చ్ నిర్వహించిన పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు రాజు ఉద్వేగంగా మాట్లాడారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గొప్పతనం తెలియక ఓడించామని,ఇప్పుడు పవన్ గొప్పతనం, మంచితనం తెలిసి 85 లక్షల కార్మికుల తరఫున క్షమాపణ అడుగుతున్నామని సభా ముఖంగా పేర్కొన్నారు.ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు పడరాని పాట్లు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఐదు నెలలుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఉపాధి లేక 36 మంది భవన నిర్మాణ కార్మికులు ప్రాణాలు పోగొట్టుకున్నా స్పందించిన నాథుడు లేడని, ఆ సమయంలోనే మీకోసం నేనున్నానంటూ పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారని పేర్కొన్నారు.పవన్ కళ్యాణ్ చాలా మంచి మనసుతో మంగళగిరి పార్టీ ఆఫీసులో భవన నిర్మాణ కార్మికులకు కలిశారని, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారని ఆ తర్వాత రెండు రోజులకే ప్రభుత్వం ఇసుక వారోత్సవాలు జరపాలని నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.నిర్మాణ రంగ కార్మికులకు న్యాయం చేయాలనే భావన తప్ప ఇందులో పవన్కు ఎలాంటి కల్మషం రాజు పేర్కొన్నారు. ఇంత గొప్ప వ్యక్తిని ఓడించి తప్పు చేశామని, అందుకు తాను సైతం బాధ్యుడనని సభా ముఖంగా క్షమాపణలు కోరారు రాజు.సమస్యలపై పోరాటం అంటే ముందుండే నాయకుడు పవన్ కళ్యాణ్ అని రాజు పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో ఈ విషయం తెలియక రాష్ట్రంలోని 85 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు జనసేన పార్టీని ఓడించి తప్పు చేశారని, అందుకు సభాముఖంగా క్షమాపణలు చెబుతున్నామని రాజు ఉద్వేగంగా మాట్లాడారు. పవన్ స్వార్ధం లేని నాయకుడని పవన్ పిలుపు మేరకు నిర్మాణరంగ కార్మికులు ఆత్మహత్య ఆలోచనను విరమించుకున్నారన్నారు.