ప్రిమియర్ బ్యాడ్మింటన్ నాలుగో సీజన్లో బెంగళూరు రాప్టర్స్ విజేతగా నిలిచింది. ఫైనల్లో చక్కటి ప్రదర్శనతో కప్ కైవసం చేసుకుంది. ఆదివారం సొంతగడ్డపై హోరాహోరీగా సాగిన టైటిల్ పోరులో బెంగళూరు 4-3 తేడాతో ముంబయి రాకెట్స్పై విజయం సాధించింది. ముంబయి ట్రంప్ మ్యాచ్గా ఎంచుకొన్న మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్లో కిమ్ జంగ్-బెర్నాడెత్ జోడీ 15-8, 15-14తో మార్కస్-లారెన్ జంటపై నెగ్గి జట్టుకు శుభారంభాన్ని అందించింది. ఆ తర్వాత జరిగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్లో బెంగళూరు కెప్టెన్ కిదాంబి శ్రీకాంత్ 15-7, 15-10తో అంటోనెన్పై గెలిచాడు. బెంగళూరు ట్రంప్ మ్యాచ్గా ఎన్నుకొన్న మహిళల సింగిల్స్ మ్యాచ్లో తి ట్రాంగ్ 15-8, 15-9తో శ్రేయాన్షి పరదేశిపై నెగ్గడంతో బెంగళూరు 3-2తో ఆధిక్యాన్ని సంపాదించింది. అయితే ఆ వెంటనే జరిగిన రెండో పురుషుల సింగిల్స్ మ్యాచ్లో ముంబయి ఆటగాడు సమీర్వర్మ 7-15, 15-12, 15-3తో సాయిప్రణీత్పై విజయం సాధించడంతో స్కోరు 3-3తో సమమైంది. ఛాంపియన్ను నిర్ణయించే పురుషుల డబుల్స్ పోరు నువ్వానేనా అన్నట్లు సాగింది. ప్రత్యర్థి జోడీ నుంచి పోటీ ఎదురైనా కీలక సమయంలో పాయింట్లు సాధించిన అహ్సాన్-హెండ్రన్ 15-13, 15-10తో జంగ్-డేలను ఓడించి బెంగళూరుకు టైటిల్ అందించారు. బెంగళూరు గత ఏడాది రన్నరప్గా నిలిచింది. ఈ సీజన్లో శ్రీకాంత్ ఆడిన అన్ని మ్యాచ్ల్లో విజయాలు సాధించడం విశేషం.