ముంబయి: న్యూజిలాండ్ వన్డే సిరీస్లో టీమిండియా పేసర్ మహ్మద్ షమి విజృంభించి ఆడుతున్నాడు. ఆతిథ్య జట్టు ఆటగాళ్లను తన పేస్తో ఇబ్బంది పెడుతున్నాడు. ప్రతి మ్యాచ్లోనూ ఎక్కువ వికెట్లు పడగొడుతూ ప్రపంచకప్ జట్టులో చోటు కోసం గట్టి పోటీనిస్తున్నాడు. కివీస్తో మూడో మ్యాచ్ విజయం తర్వాత షమికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు. గాలి బాగా వీస్తున్నప్పుడు బౌలింగ్ అంతబాగా ఎలా వేశావ్ అని వ్యాఖ్యాత సిమోన్ డల్ ప్రశ్నించాడు. అందుకే షమి ఇంగ్లిష్లో సమాధానం ఇచ్చాడు. అవతలి ఎండ్ నుంచి భువి చక్కగా సహకారం అందిస్తుండటంతో మరోవైపు తాను విజృంభించానని అన్నాడు. షమి ఎక్కువగా ఇంగ్లిష్లో మాట్లాడడు. అందుకే అతడు మాట్లాడిన తర్వాత ‘యువర్ ఇంగ్లిష్ ఈజ్ బహుత్ అచ్చా’ అని డల్ ప్రశంసించాడు. కివీస్ మాజీ క్రికెటర్ హిందీ పదాలు ఉపయోగించడంతో కోహ్లీ, షమి చిరునవ్వులు చిందించారు. ఇప్పటికే 3-0తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్ మిగతా రెండు మ్యాచుల్లో గెలిచి క్లీన్స్వీప్ చేయాలని పట్టుదలతో ఉంది. కోహ్లీకి విశ్రాంతినివ్వడంతో రోహిత్ శర్మ మిగతా వన్డేలు, టీ20 మ్యాచ్లకు సారథ్యం వహిస్తాడు.