జమ్ము కశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్థాన్ ఇప్పటికీ అక్కసు వెల్లగక్కుతూనే ఉంది.భారత్ చర్యను ప్రపంచదేశాలు ఖండిచాలని పిలుపునిస్తూనే భారత్తో వాణిజ్య,దౌత్య సంబంధాలు తెంచుకుంటున్నామని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు.దీంతోపాటు కొద్ది రోజుల క్రితం పునఃప్రాంభించిన గగనతలాన్ని కూడా మూసివేశారు.దీంతో అగ్రరాజ్యం అమెరికా కశ్మీర్ అంశంపై స్పందించింది.జమ్మూ కశ్మీర్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోందని అమెరికా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. జమ్మూ కశ్మీర్ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై కూడా అమెరికా ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని చెప్పారు. మరోవైపు పాక్ బెదిరింపు ధోరణిని కూడా అమెరికా పరిశీలిస్తోందని ఇప్పటికే భారత్తో వాణిజ్య సంబంధాలు, దౌత్యపరమైన సంబంధాలకు చెక్ పెట్టినట్లు తమ దృష్టికి వచ్చిందని ఆ అధికారి పేర్కొన్నారు. “అమెరికా అన్ని విషయాలను జాగ్రత్తగా సమీక్షిస్తోంది. కొత్తగా ఏర్పాటు చేసిన జమ్మూ కశ్మీర్ లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాల్లో పరిణామాలను పరిశీలిస్తున్నాం. అంతేకాదు ఆ ప్రాంతంలో అస్థిరత కూడా నెలకొనే అవకాశం ఉండటంతో దానిపై కూడా ఆరా తీస్తున్నాం“అని ట్రంప్ ప్రభుత్వంలో ఓ ముఖ్య అధికారి వెల్లడించారు. ఇక దక్షిణాసియాలో శాంతినెలకొనేలా అన్ని దేశాలు ప్రయత్నించాలని ఇందుకోసం చర్చలు ప్రారంభించాలని అమెరికా కోరింది. జమ్మూ కశ్మీర్లో కొనసాగుతున్న ఆంక్షలపై సెనేటర్ రాబర్ట్ మెనెండెజ్, కాంగ్రెస్ అధికారి ఇలియట్ ఏంజెల్ ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.భారత్పై పాకిస్తాన్ ప్రతీకారచర్యలకు పాల్పడకూడదని వారు తెలిపారు. అంతేకాదు చొరబాట్లను ప్రోత్సహించరాదని కూడా హెచ్చరించారు. తమ భూభాగంపై ఉన్న ఉగ్రవాదులను ఏరిపారేయాలని పాకిస్తాన్కు సెనేటర్లు సూచించారు.