అహ్మదాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా పర్యటన సందర్భంగా పాకిస్తాన్తో సంబంధాల గురించి ప్రస్తావించి అందరినీ విస్మయానికి గురి చేశారు. అహ్మదాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం సందర్భంగా అమెరికా-పాకిస్థాన్ల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయని ట్రంప్ చెప్పడం గమనార్హం. అహ్మదాబాద్లో కొత్తగా నిర్మించిన మొటేరా స్టేడియంలో ట్రంప్ ప్రసంగిస్తూ, భారత్ను ఆకాశానికెత్తేశారు. భారతదేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలు, విలువలను కొనియాడారు. భారత్కు అత్యంత భయానక ఆయుధాలను అందిస్తామని హామీ ఇస్తూ, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. ఇదే సమయంలో వాషింగ్టన్తో పాకిస్థాన్ సంబంధాల గురించి ప్రస్తావిస్తూ, చాలా బాగున్నాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య పెద్ద పురోగతి సాధించే దిశగా సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు. అహ్మదాబాద్ బహిరంగ సభలో పాకిస్థాన్తో మెరుగుపడుతున్న సంబంధా లగురించి ట్రంప్ ప్రస్తావించడం ఆసక్తిగా మారింది. ఇదేతో కాకతాళీయంగా చేసిన ప్రస్తావన కాదని భావిస్తున్నారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ను ఏకాకిని చేయాలని భారత్ ప్రయత్నిస్తున్న సందర్భంలో సాక్షాత్తు భారత ప్రధాని సమక్షంలో ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.