కళ్లు తెరిచి చూస్తే… భౌతిక రూపాలు కనిపిస్తాయి. మనసుతో చూస్తే… అచ్చమైన ఆర్ద్రత కళ్లకు కడుతుంది. మనోనేత్రంతో చూస్తే… స్వచ్ఛమైన జీవితాలు కనిపిస్తాయి. జీవితాలను చూడటం… జీవించడంలో అందాన్ని చూడటమే తన పర్యటనల ఉద్దేశం అంటారు కవిత బుగ్గన.
ఈ ఏడాది… భారతీయ నాట్య కళాకారిణి మృణాళినీ శారాబాయ్, ప్రముఖ ఉర్దూ కవి కైఫీ అజ్మీల శత జయంతి. దేశం ఇప్పటికే జాతిపిత మహాత్మాగాంధీ నూటయాభయ్యవ జయంతి ఉత్సవాలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్.. 2019లో శుక్రవారం (జనవరి, 25) నాడు తన తొలి పుస్తకాన్ని ఆవిష్కరించారు కవిత బుగ్గన. ‘వాకింగ్ ఇన్ క్లౌడ్స్: ఎ జర్నీ టు మౌంట్ కైలాస్ అండ్ లేక్ మానససరోవర్’ అనే ఆ రచనను వెలువరించడానికి ముందు మూడు దశాబ్దాల ఆమె అధ్యయనం ఉంది. శ్రీలంక, నేపాల్, టిబెట్, లెబనాన్, రుమేనియా, ఇటలీ, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా, కెనడా, స్పెయిన్, చైనా, జపాన్, కంబోడియా, మయన్మార్, థాయ్లాండ్, టాంజానియా దేశాల్లో పర్యటించారామె. ఆ పర్యటనల్లో మనిషి జీవితాన్ని చూశారామె. పరిస్థితులు జీవితాన్ని ఎన్ని మలుపులు తిప్పుతాయో కాంబోడియా పర్యటనలో తెలుసుకున్నారు. రిషి వ్యాలీ స్కూల్ ఆమెకు అక్షరాలను, పాఠాలను చదవడంతోపాటు ప్రపంచాన్ని చదవడం కూడా నేర్పించింది. అన్నింటికంటే ముందు ప్రశ్నించడం నేర్పించింది. ఆ లక్షణమే ఆమెను మానసరోవర్ యాత్రలో రాక్షస్ తాల్ నీటిని తాగించింది. రాక్షస్ తాల్ విషపు నీటి మడుగు అనే మూఢనమ్మకాన్ని తుడిచేయడానికి తన వంతు ప్రయత్నం చేయించింది. పర్యటన అంటే… ప్రదేశాలను కళ్లతో చూడటం కాదు, పరిస్థితులను మనోనేత్రంతో చూడటం అంటూ.. తన అనుభవాలను, అనుభూతులను పంచుకున్నారు కవిత.