అమరావతి: నిబంధనలకు విరుద్దంగా, అవినీతితో నిర్మించిన ప్రజా వేదిక భవనాన్ని కూల్చి వేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సోమవారం చేసిన ప్రకటన తెదేపా వర్గాల్ని కలవర పరిచింది. తెదేపా నేతలు చంద్ర బాబు నాయుడు నివాసంతో అత్యవసరంగా సమావేశమై తమ నేతతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. దరిమిలా అప్రమత్తమైన పోలీసులు ప్రజావేదిక వద్ద భారీగా బలగాలను మోహరించారు. చంద్రబాబు నివాసం, ప్రజావేదిక మధ్య బారికేడ్లు, కంచె నిర్మించారు. తెదేపా నేతలు చంద్రబాబు ఇంటి నుంచి నేరుగా ప్రజావేదిక వద్దకు వచ్చి ఆందోళన చేపట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో ఎల్లపుడూ ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక వేళ తెదేపా నేతలు ఆందోళనకు దిగితే వారిని బంధించి తరలించేందుకు కూడా పోలీస్ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారని తెలిసింది.