హొసూరు : స్థానిక తేరుపేటలో కొండపై 1500 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతన కాలభైరవ స్వామి దేవాలయ పునరుద్ధరణ పనులు జోరుగా జరుగుతున్నాయి. మరకత సమేత శ్రీ చంద్ర చూడేశ్వర స్వామి దేవాలయం, కాళికాంబ దేవాలయం, పరివార దేవతల దేవాలయాలు కొండ చుట్టూ ఉన్నాయి. ఈ దేవాలయాలకు తమిళనాడు నుంచే కాకుండా ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన భక్తులు వస్తుంటారు. చంద్ర చూడేస్వరస్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఈ కొండపై మరుగున పడిన కాలభైరవ దేవాలయాన్ని వెలుగులోకి తెచ్చేందుకు హొసూరు మాజీ ఎమ్మెల్యే కేఏ. మనోహరన్ నడుం బిగించారు. అందులో భాగంగా రూ.40 లక్షల ఖర్చుతో పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. పనులు పూర్తి కావస్తున్నాయి. అతి త్వరలో దేవాలయ కుంభాభిషేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు మనోహరన్ ఒక ప్రకటనలో తెలిపారు.