హైదరాబాద్ నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు మంగళవారం నుంచి నగరరోడ్లపై పరుగులు తీయనున్నాయి.మియాపూర్,కంటోన్మెంట్ డిపోల నుంచి రెండు ప్రధాన మార్గాల మీదుగా 40 ఎలక్ట్రిక్ బస్సులు శంషాబాద్ విమానాశ్రయం వరకు నడవనున్నాయి.కంటోన్మెంట్కు చెందిన బస్సులు జూబ్లి బస్స్టేషన్ నుంచి బయలుదేరనుండగా మియాపుర్ డిపోకు చెందిన బస్సులు బీహెచ్ఈఎల్,మియాపుర్ నుంచి నడవనున్నాయి. హైదరాబాద్ నగరంలో వాహనాలు ఏడాదికేడాది పెరుగుతుండడంతో వాహనాల సంఖ్య కూడా అంతేస్థాయిలో పెరుగుతోంది.ఫలితంగా హైదరాబాద్ నగరంలో కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది.ఈ నేపథ్యంలో కాలుష్యాన్ని నివారణకు శ్రీకారం చుట్టిన అధికారులు ఎలక్ట్రిక్ బస్సులను రోడ్లపైకి తెచ్చారు.ఎలక్ట్రిక్ బస్సుల్లో ఏసీ,వైఫై,రేడియో సిస్టమ్ తదితర అధునాతన సదుపాయాలు ప్రయాణీకుల కోసం ఏర్పాటు చేశారు.40 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ బస్సులు లిథియం ఇయాన్ బ్యాటరీలతో నడవనున్నాయి.ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 240 కిలోమీటర్లు నిరాటంకంగా ప్రయాణించగలవు.దీంతోపాటు బస్సులు రోడ్లపై నడిచేటపుడు గాలి కాలుష్యం,శబ్ద కాలుష్యం ఉండదు.ప్రమాదాలు జరుగకుండా అత్యాధునిక సాంకేతికత కూడా ఏర్పాటు చేశారు.బస్సులో వేడి పెరిగినపుడు,అగ్ని ప్రమాదాలు జరిగినపుడు ప్రాణనష్టం జరుగకుండా స్పెషల్ ప్రోటెక్షన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు.ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్,ఎల్ఈడీ లైటింగ్,ముందు వెనుక సౌకర్యవంతమైన సస్పెన్షన్ సిస్టమ్,వృద్ధులు ఎక్కడానికి,దిగడానికి వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఆయా మార్గాల్లో నిర్ణయించిన ధరలు పరిశీలిస్తే..జూబ్లి బస్స్టేషన్ నుంచి విమానాశ్రయానికి రూ.265 వసూలు చేయనుండగా మియాపుర్ నుంచి రూ.280 వసూలు చేయనున్నారు.