అమరావతి : శాసనసభ సమావేశాల్లో బుధవారమూ తెదేపా సభ్యులు నిరసన తెలిపారు. జంగారెడ్డిగూడెం మరణాల పై చర్చకు పట్టు బట్టారు. మరణాల పై ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటన సభను తప్పు దారి పట్టించేలా ఉన్నాయని ఆరోపించారు. సభాపతి వేదిక చెంతకు వెళ్లిన తెదేపా సభ్యుల్ని ఒక రోజు సస్పెండ్ చేయాలని ఉప ముఖ్య మంత్రి నారాయణ స్వామి ప్రతిపాదించారు. వారు కావాలనే రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. వారి జాతకాలు రేపు బయటపెడతానని హెచ్చరించారు. ఆ విషయాలు తప్పని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలు విసిరారు. అనంతరం పదకొండు మంది తెదేపా సభ్యుల్ని సభాపతి సస్పెండ్ చేసారు.