సైనికుల వేషంలో సినిమా హీరోలు చిత్రాల్లో నటించే సన్నివేశాలు,హీరోలు చెప్పే డైలాగులు నిజమైన సైనికులు చెబితే ఎంత ఉద్విగ్నంగా ఉంటుందో,అందులో ఎంత దేశభక్తి ఉంటుందో తాజాగా తమిళనాడుకు చెందిన ఓ సైనికుడు తన బంధువుకు వాట్సాప్ ద్వారా పంపిన వీడియో తెలియజేస్తోంది. మరి కొద్ది నెలల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సి ఉండగా దేశం కోసం ప్రాణత్యాగానికి సిద్ధమయ్యాడు ఓ జవాను.‘నా కోసం బెంగ పెట్టుకోవద్దు..పెళ్లి సమయానికి నేను వస్తా..ఒకవేళ నేను రాకుంటే నా దుస్తులు వస్తాయి’అంటూ పోస్ట్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్గా మారింది.తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలి జిల్లా మరుకాలకురిచ్చి గ్రామనికి చెందిన సుబ్బయ్య కుమారుడు వానమామలై(25) భారతసైన్యంలో విధులు నిర్వర్తిస్తున్నారు.గత ఏడాది సుబ్బయ్య మరణించగా తల్లి చెల్లామ్మాల్,ఇద్దరు సోదరిలు ఉన్నారు.కొద్ది రోజుల క్రితం అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో వానమామలైకు నిశ్చితార్థం జరిగింది.జూన్లో వివాహం నిశ్చయించారు.దీంతో అప్పటి నుంచి వానమామలై కుటుంబ సభ్యులు, అత్తింటి వారు, కాబోయే భార్య సైతం తరచు అతనితో సెల్ఫోన్లో మాట్లాడుతున్నారు.ఈ క్రమంలో గత నెలలో పుల్వామాలో ఉగ్రవాదుల దాడి అనంతరం భారతవాయు సేన ఉగ్రవాదులపై ప్రతీకార చర్యలు చేపట్టడం చకచక జరిగిపోయాయి.ఈ ఘటనల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో యుద్ధానికి సన్నద్ధం కావాలంటూ ఆదేశాలు అందాయి.ఈ క్రమంలో వానమామలై విధులు నిర్వర్తిస్తున్న మధ్యప్రదేశ్ సైనిక దళాన్ని సిద్ధంగా ఉండాల్సిందిగా భారత ప్రభుత్వం ఆదేశించింది.దీంతో వానమామలై తన కాబోయే భార్య బంధువుల్లో ఒకరికి వాట్సాప్ ద్వారా ఒక సందేశాన్ని పంపాడు. ‘మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మేరకు అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. యుద్ధానికి వెళుతున్న నేను తిరిగి వస్తానో రానో. నేను రాకుంటే నా దుస్తులు ఇంటికి వస్తాయి. పెళ్లి కుమార్తె పేరును ప్రస్తావిస్తూ ఈ విషయాన్ని ఆమెతో చెప్పవద్దు. ఇక అంతా దైవాదీనం. ఇకపై నేను ఫోన్లో మాట్లాడడానికి వీలుకాదు. వీలుంటే ఉదయం మాట్లాడతాను అంటూ వాట్సాప్లో సమాచారం ఇచ్చాడు. యుద్ధానికి సంబంధించిన ఉత్తర్వులను తాత్కాలికంగా నిలుపుదల చేసినట్టు సమాచారం వచ్చిందని, తన కుటుంబ సభ్యులకు వానమామలై మరుసటి రోజు తెలియజేశాడు.దేశాన్ని రక్షించే జవానుల పరిస్థితి ఎలా ఉంటుందో తెలిపే ఈ హృదయ విదారక సమాచారం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.