దూరదర్శన్‌ లోగోకు కాషాయం.. పొలిటికల్ దుమారం

దూరదర్శన్‌ లోగోకు కాషాయం.. పొలిటికల్ దుమారం

చెన్నై: కేంద్ర ప్రభుత్వ ఆఽధీనంలో దూరదర్శన్ లోగో ఎరుపు రంగునుంచి కాషాయ రంగుకు మార్చడం పట్ల డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచార సభల్లో తాను ఆరోపించినట్లే బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే అంతటా కాషాయ రంగే కనిపిస్తుందని చెప్పిన మాట ఇప్పుడు వాస్తవరూపం దాల్చిందన్నారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ పేజీలో ఓ ప్రకటన విడుదల చేశారు. మూడోసారి మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమాతోనే బీజేపీ పాలకులు దూరదర్శన్ లోగోను కాషాయ రంగులోకి మార్చారని, ఇది లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే తీసుకున్న ముందస్తు చర్య అని, ఇక అధికారంలోకి వస్తే దేశమంతా కాషాయరంగే కనిపించడం తథ్యమని స్టాలిన్ అన్నారు. తమిళ ప్రజలు పంచమ వేదంగా భావించే తిరుక్కురళ్ను అందించిన తిరువళ్లువర్ విగ్రహాలకు బీజేపీ, ఆర్ఎ్సఎస్, వీహెచ్పీ నేతలు, కార్యకర్తలు ఇష్టమొచ్చినట్లు కాషాయ రంగులు పులిమారని, కాషాయ దుస్తులు ఽవేసి కళంకం సృష్టించారని ఆయన ఆరోపించారు. అంతే కాకుండా ద్రావిడ సిద్ధాంతాలను రూపొందించిన పెరియార్ వంటి నేతల విగ్రహాలను సైతం ఈ విధంగానే కళంకపరచిన ఘనత బీజేపీ, వీహెచ్పీ నాయకులకే దక్కుతుందన్నారు. రేడియో స్టేషన్లకు తమిళంలో ‘వానొలి’ అనే స్వచ్చమైన తమిళ పేరుండేదని, ఆ పేరును కాస్తా ‘ఆకాశవాణి’గా మార్చి సంస్కృతానికి పట్టం గట్టారని, ఇక తమిళ దూరదర్శన్కు తమిళ భాషా పండితులంతా మెచ్చుకునే రీతిలో ‘పొదిగై’ అనే పేరుండేదని, దానిని కాస్తా డీడీ తమిళ్గా మార్చేశారని స్టాలిన్ పేర్కొన్నారు. కాగా పేర్లు మార్చటంతోనే సంతృప్తి చెందని బీజేపీ పాలకులు దూరదర్శన్ లోగో ఎరువుపు రంగును కాస్తా కాషాయవర్ణంలోకి మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే అంతటా కాషాయ రంగే కనిపిస్తుందని చెప్పానని, ప్రస్తుతం తన మాటలే నిజమవుతున్నాయని, ఈ పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లోని ప్రజలంతా ఎన్డీయేని చిత్తుగా ఓడించాలని స్టాలిన్ పిలుపునిచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos