హోసూరు : తన తల్లిని కాదని మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న తండ్రిని మందలించినా వినకపోవడంతో హత్య చేశానని కొడుకు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. పోలీసుల కథనం మేరకు కృష్ణగిరి జిల్లా సూలగిరి సమీపంలోని సాధేపల్లి గ్రామానికి చెందిన నారాయణప్ప(48) రెండు రోజుల క్రితం పొలం వద్ద దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టిన సూలగిరి పోలీసులకు ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. పోలీసుల కథనం మేరకు నారాయణప్ప అదే గ్రామానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడు. దీనిపై ఇంట్లో భార్యా భర్తలు తరచూ గొడవపడేవారు. తండ్రి వివాహేతర సంబంధం వల్ల ఇంట్లో ప్రశాంతత లోపించడంతో నారాయణప్ప కొడుకు నవీన్, చిన్నాన్న కొడుకు అజిత్తో కలసి దారుణంగా హత్య చేశాడు. నవీన్ నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ఇద్దరిని పోలీసులు రిమాండుకు తరలించారు.