గొప్పగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి తెరాస అధినేత కేసీఆర్ తెరాస శ్రేణులు చేస్తున్న ప్రచారం అంతా ఇంతా కాదు.దేశంలోనే గొప్ప ప్రాజెక్టని కేవలం మూడేళ్లలో నిర్మించి చరిత్ర సృష్టించామని ఉప్పొంగిపోతూ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిపించి తన ఘనతను చాటుకోవడానికి కేసీఆర్ కిందా మీదా పడుతున్నారు.ఎవరు అవునన్నా కాదన్నా కాళేశ్వరం ప్రాజెక్ట్ గొప్ప ప్రాజెక్టే అందులో ఎటువంటి సందేహాలు లేవు.కానీ కాళేశ్వరంతో పాటు ఇతర చిన్న ప్రాజెక్టులు కూడా అంతే ముఖ్యమనే విషయాన్ని తెరాస శ్రేణులతో పాటు అధినేత కేసీఆర్ ఎందుకు విస్మరిస్తున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.కాళేశ్వరం ప్రాజెక్ట్పైనే దృష్టి సారించి ప్రాజెక్ట్ను త్వరగా నిర్మించి తన గొప్పలు దేశం మొత్తం చాటింపు వేసుకోవాలని తపన పడుతున్న కేసీఆర్ రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని చిన్న,మధ్య తరహా నీటి ప్రాజెక్ట్లను ఎందుకు నిర్లక్షం చేస్తున్నారంటూ ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మహబూబ్నగర్,నారాయణపేట జిల్లాలోని అనేక మండలాలకు తాగుసాగు నీరు అందించే కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ను పూర్తిగా నిర్లక్షం చేస్తున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఏటా ప్రాజెక్టు నిర్వహణ పనులకు నిధులు కేటాయించాల్సి ఉన్నప్పటికి చిల్లి గవ్వయినా విడుదల చేయడం లేదని ఆ జిల్లాల ప్రజలు ఆరోపిస్తున్నారు.నిధుల సంగతి పక్కనపెడితే కనీసం ప్రాజెక్ట్పై నడచివెళ్లడానికి సరైన దారి కూడా లేదని చివరకు ప్రాజెక్ట్ వద్ద విద్యుత్ దీపాలు కూడా లేకపోవడంతో అసలు ఇక్కడ ప్రాజెక్ట్ ఉందనే విషయం కేసీఆర్కు గుర్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయంటూ విమర్శిస్తున్నారు.జూన్ నెల చివరిలో జూరాల ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల ద్వారా కోయిల్సాగర్ ప్రాజెక్టులోకి నీటిని తరలించే అవకాశం ఉంటుంది. నీటిపారుదల శాఖ అధికారులు ఆలోపు ప్రాజెక్టు వద్ద నిర్వహణ పనులకు చర్యలు తీసుకోవాలి. జూన్ నెలలో రెండు వారాలు పూర్తి అయినా అధికారులు కనీసం స్పందించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.