మౌంట్ మాంగనుయ్ (న్యూజిలాండ్): ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనల్లో భారత్ అద్భుత విజయాలు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ. న్యూజిలాండ్తో సోమవారం జరిగిన మూడో వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో గెలవడంలోనూ రోహిత్ (62; 77 బంతుల్లో 3×4, 2×6) కీలకంగా వ్యవహరించాడు. దీంతో ఐదు మ్యాచుల వన్డే సిరీస్లో వరుసగా మూడు విజయాలు సాధించి, రెండు మ్యాచులు మిగిలి ఉండగానే భారత్ ఈ సిరీస్ను సొంతం చేసుకుంది. మైదానంలో రోహిత్ నిలదొక్కుకున్నాడంటే పరుగుల వరద పారాల్సిందే. మూడో మ్యాచ్లో 62 పరుగులు బాది టీమిండియాలో టాప్ స్కోరర్గా నిలిచారు. ఈ మ్యాచ్లో రెండు సిక్సర్లు బాదిన అతడు… వన్డేల్లో అత్యధిక సిక్సులు కొట్టిన టీమిండియా బ్యాట్స్మెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును సమం చేశాడు. ధోనీ ఇప్పటివరకు మొత్తం 337 వన్డేలు ఆడి 222 సిక్సులు బాదాడు. అయితే, అందులో ఏడు సిక్సర్లు ఆసియా XIజట్టు తరఫున ఆడుతున్న సమయంలో కొట్టాడు. టీమిండియా తరఫున వన్డేల్లో 215 సిక్సర్లు కొట్టి అత్యధిక సిక్సులు బాదిన బ్యాట్స్మెన్గా ఉన్నాడు. అయితే, సోమవారం రెండు సిక్సులు బాదిన రోహిత్… తన ఖాతాలో 215 సిక్సులను వేసుకున్నాడు. దీంతో ధోనీ రికార్డును సమం చేశాడు. సోమవారం జరిగిన మ్యాచ్లో ధోనీ ఆడలేదన్న విషయం తెలిసిందే. తొడ కండరాలు పట్టేయడంతో ఈ మ్యాచ్లో ఆడకుండా విశ్రాంతి తీసుకున్నాడు. న్యూజిలాండ్తో నాలుగో వన్డే జనవరి 31న, ఐదో వన్డే ఫిబ్రవరి 3న జరగనుంది. ఈ ఇద్దరు స్టార్ బ్యాట్స్మెన్ ఈ వన్డేల్లో ఆడే అవకాశం ఉంది. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్ల జాబితాలో ధోనీ, రోహిత్ అగ్రస్థానంలో ఉండగా, టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ తెందూల్కర్ 195 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తరువాతి స్థానాల్లో సౌరవ్ గంగూలీ (189 సిక్సులు), యువరాజ్ సింగ్ (153) ఉన్నారు.