హైదరాబాద్ : సినీ నటుడు శివాజీ అమెరికా వెళ్లడానికి హైకోర్టు మరో సారి అనుమతి ఇచ్చింది. అలంద మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ఇటీవల అమెరికా వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై ఆయన దాఖలు చేసిన పిటిషన్ను ఉన్నత న్యాయ స్థానం బుధవారం విచారించింది. ఆయనపై జారీ అయిన లుకౌట్ నోటీసులను తొలగించాలని హైకోర్టు ఆదేశించినా పోలీసులు పట్టించుకోలేదని శివాజీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీని వల్ల దుబాయ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన అమెరికాకు వెళుతున్నప్పుడు అడ్డుకున్నారని తెలిపారు. గత నెల 24న హైకోర్టు అదేశాలు వెలువడడంతో 25న శివాజీ అమెరికా పయనమయ్యారని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. హైకోర్టు ఆదేశాలు వెలువడ్డాక లుకౌట్ నోటీసులు తొలగించడానికి మూడు రోజుల సమయం పడుతుందని చెప్పారు. భారత్లో శివాజీని ఎవరూ ఆపలేదని, దుబాయ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆపారని తెలిపారు. సమాచార లోపం వల్ల ఇదంతా జరిగిందని పేర్కొన్న న్యాయ స్థానం రేపటి నుంచి మూడు వారాల పాటు శివాజీ అమెరికా వెళ్లడానికి అనుమతినిచ్చింది.