దిల్లీ : న్యూజిలాండ్తో వన్డే సిరీస్ను ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే భారత్ 3-0తో చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. చివరి రెండు మ్యాచ్లకు కెప్టెన్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో యువ ఆటగాడు శుభ్మన్ గిల్ను ఆడించాలని సునీల్ గావస్కర్ కోరుతున్నారు. టీమిండియా మెనేజ్మెంట్ గిల్ను కోహ్లీ స్థానంలో నం.3లో బ్యాటింగ్కు పంపించాలని సూచించారు. ‘‘కోహ్లీకి విశ్రాంతితో నం.3 స్థానం ఖాళీగా ఉంది. ఆ స్థానంలో గిల్ను ఆడించాలి. అతడికి రెండు మ్యాచ్ల్లో అవకాశం కల్పించి ఎలా ఆడుతున్నాడో పరిశీలించాలి.’’ అని గావస్కర్ అన్నాడు. పృథ్వీషా నేతృత్వంలో అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో గిల్ కూడా ఒకడు. తన ఆట తీరుతో కెప్టెన్ కోహ్లీని మెప్పించిన గిల్కు న్యూజిలాండ్ సిరీస్తో అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. 19 ఏళ్ల గిల్లో గొప్ప ప్రతిభ ఉందని.. తాను అదే వయసులో ఉన్నపుడు అందులో 10 శాతం ప్రతిభ కూడా లేదని విరాట్ మూడో మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్నాడు. ‘‘నాకు 19 ఏళ్లున్నపుడు శుభమన్ ప్రతిభలో పది శాతం కూడా నాలో లేదు. కుర్రాళ్ల ఆత్మవిశ్వాసం భారత జట్టుకు ఎంతో మేలు చేస్తుంది’’ అని చెప్పాడు.