శ్రీహరికోట : చంద్రయాన్-2 అసలు ప్రయోగం ఇప్పుడే మొదలైందని, వచ్చే 45 రోజులు తమకు అత్యంత కీలకమని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. చంద్రయాన్-2 ప్రయోగం అనంతరం ఆయన మాట్లాడారు. ఇప్పటికి రాకెట్ను విజయవంతంగా నింగిలోకి పంపామన్నారు. మార్క్-3 విజయం కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. చంద్రయాన్-2లో ఇది ఆరంభం మాత్రమేనని చెప్పారు. సెప్టెంబర్ 7న రాత్రి ల్యాండర్ చంద్రుడిపై దిగిన తర్వాత యాత్ర పూర్తవుతుందన్నారు. తీవ్రమైన సాంకేతిక సమస్యలను అధిగమించగలిగామన్నారు. సమస్యను గుర్తించి వారంలోనే పరిష్కరించామని, శాస్త్రవేత్తలందరూ 24 గంటలూ తదేక దీక్షతో పనిచేశారని ప్రశంసించారు. అనుక్షణం అత్యంత కఠినమైన పరీక్షలను ఎదుర్కొన్నామన్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో భారత్ను ఉన్నతంగా ఉంచడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు.