హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలు సహా కేరళలో తమ పార్టీ బలపడుతుందని భాజపా అధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. శంషాబాద్లోని కేఎల్సీసీ హాలులో చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ శ్రేణులనుద్దేశించి ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజల బతుకులు బాగు పడాలంటే భాజపా గెలుపు అవసరమన్నారు. రాష్ట్రంలో భాజపా జెండా ఎగరవేస్తామని, అదే తమ ధ్యేయమని చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో 20 శాతం ఓట్లు వచ్చాయని, అతి పెద్ద పార్టీగా భవిష్యత్లో అవతరించడం ఖాయమని తెలిపారు. భాజపాలో ప్రతి సభ్యుడికి ప్రాధాన్యం ఉంటుంన్నారు. బడ్జెట్లో రైతులకు, పేదలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని వివరించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, మురళీధర్ రావు, దత్తాత్రేయ పాల్గొన్నారు.