హొసూరు : పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ప్రత్యేక తరగతులకు హాజరైన విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన ఆ పాఠశాల కరస్పాండెంట్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. హొసూరు- రాయకోట రోడ్డులో ఓ ప్రైవేట్ పాఠశాల ఉంది. గురుదత్త అనే వ్యక్తి అందులో కరస్పాండెంట్గా పని చేస్తున్నాడు. ప్రతి ఆదివారం ఈ పాఠశాలలో తమిళ వ్యాకరణంపై ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. హొసూరులోని మరో పాఠశాలలో చదువుతున్న తొమ్మిదేళ్ల విద్యార్థిని ఈ తరగతులకు హాజరవుతోంది. ఇందులో భాగంగా నిన్న గురుదత్తను కలిసేందుకు వెళ్ళింది. ఇదే అదనుగా అతను లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటనతో అవాక్కయిన బాలిక అక్కడ నుండి తప్పించుకుని తన కోసం ఎదురు చూస్తున్న తండ్రి వద్దకు వెళ్లి జరిగిందంతా చెప్పింది. దీనిపై ఆయన కృష్ణగిరి జిల్లా బాలల సంక్షేమ శాఖ కార్యాలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు హొసూరు మహిళా పోలీసులు కేసు నమోదు చేసుకొని సంఘటనా స్థలానికి వచ్చి విచారణ చేపట్టారు. గురుదత్త అప్పటికే అక్కడి నుండి తప్పించుకున్నాడు. పోలీసులు గాలింపు చేపట్టి అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన హొసూరులో సంచలనం సృష్టించింది.