హత్యానేరం కేసులో సాక్షులకు పోలీస్స్టేషన్లో తర్ఫీదు ఇవ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీస్ అధికారుల చర్య దిగ్భ్రాంతికరమని జస్టిస్ అభయ్ ఎస్.ఓక్, జస్టిస్ పంకజ్ మిత్తల్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం పేర్కొంది. దీనిపై దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు డీజీపీని ఆదేశించింది. హత్య కేసులో ఇద్దరు నిందితులను దోషులుగా తేల్చి జీవిత ఖైదు విధించిన దిగువ న్యాయస్థానాల తీర్పును కొట్టివేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. పోలీసులు తమకు కావలసిన విధంగా సాక్షులకు తర్పీదునిచ్చిన విషయాన్ని ట్రయల్ కోర్టు, హైకోర్టు గుర్తించలేకపోవడం విస్మయపరిచిందని పేర్కొంది. కోర్టులో ఎలా చెప్పాలో ముందుగానే సాక్షులకు పోలీసులు శిక్షణ ఇవ్వడం అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని, న్యాయప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని అభిప్రాయపడింది. అటువంటి సాక్ష్యాలు చెల్లబోమని స్పష్టం చేసింది. అసలైన సాక్షులను వదిలేసి, పోలీసులు సిద్ధం చేసిన వారిని కోర్టులో ప్రశ్నించారని పేర్కొంది. 2007 అక్టోబరు 4న బాలమురుగన్ అనే వ్యక్తిని మణికందన్, శివకుమార్ హత్య చేశారంటూ కేసు నమోదైంది. బాలమురుగన్ ఇంటి వద్ద జరిగిన ఘర్షణలో ఈ ఘటన చోటుచేసుకుంది.