న్యూఢిల్లీ : ఆక్సిజన్ సరఫరా విషయంలో కేంద్రం తీరును సుప్రీంకోర్టు మరోసారి దుయ్యబట్టింది. ఢిల్లీకి రోజుకు 700 మెట్రిక్ టన్నుల చొప్పున ఆక్సిజన్ను సరఫరా చేయాలని ఇచ్చిన ఆదేశాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. వీటిని సమీక్షించే వరకు లేదా సవరించే వరకు కచ్చితంగా అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రోజుకు 700 మెట్రిక్ టన్నుల చొప్పున ఆక్సిజన్ను సరఫరా చేయడం లేదని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయ స్థానానికి తెలిపింది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ జరిపింది. తన ఆదేశాలను కచ్చితంగా పాటించాలని, నిర్బంధం విధించే ఆదేశాలను జారీ చేసే విధంగా తనను ప్రేరేపించవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.