రాయదుర్గం : ఓ యువకుడు కామవాంఛ తీర్చమని ఓ యువతిపై ఒత్తిడి చేస్తూ ఆమెను బలవంతం చేయగా ఆమె తిరస్కరించింది. ఈ విషయాన్ని గ్రామంలో అందరికీ చెబుతుందని భయపడిన ఆ యువకుడు ఆమెకు బలవంతంగా పురుగుల మందు తాగించిన సంఘటన ఈ నెల 8వ తేదీన అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలం నాగలాపురంలో చోటుచేసుకోంది. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగలాపురం గ్రామానికి చెందిన యశోద(19) అనే యువతి పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటుండగా అదే గ్రామానికి చెందిన శివకుమార్ అనే యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. పక్క పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు కొందరు ఈ విషయాన్ని గమనించి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలికి చేరుకొని ఆమెను చికిత్స నిమిత్తం కర్ణాటకలోని బళ్లారి విమ్స్ కు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ఆమె మరణించింది. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు డి.హీరేహాళ్ ఎస్సై వెంకటరమణ యువకునిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.