న్యూ ఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలపై ఉత్తరాదిన ఉన్న రైతు సంఘాలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా ఉద్ధృతి కారణంగా ఈ ఉద్యమం కొంచెం నెమ్మదించినప్పటికీ రైతులు మాత్రం ఢిల్లీ సరిహద్దుల్లోనే నిరసనలు కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి రైతు సంఘాలు గురువారం మరోసారి హెచ్చరికను జారీ చేశాయి. ‘మా సహనాన్ని పరీక్షించవద్దు. వెంటనే చర్చలను ప్రారంభించండి. మా డిమాండ్లను అంగీకరించాల’ని కోరాయి. ఢిల్లీ సరిహద్దులో ఉంటూ ఉద్యమం చేస్తున్న రైతుల్లో ఎక్కువగా పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ వారే ఉన్నారు. వీరందరూ ఢిల్లీ సరిహద్దులైన సింఘు, టిక్రి, ఘాజీపూర్ లలో గత ఆరు నెలలుగా నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు. కేంద్రానికి, రైతు సంఘాలకు మధ్య ఇప్పటి వరకు 11 విడతల చర్చలు జరిగాయి. ఎలాంటి పురోగతీలేదు.