ముంబై : దేశంలో వేగంగా కరోనా వైరస్ విజృంభిస్తున్నందున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) చేపట్టాల్సిన చర్యల్ని మాజీ గవర్నరు రఘు రామ్ రాజన్ సూచించారు. దెబ్బతిన్న వ్యాపారాలకు క్రెడిట్ ఇవ్వాలి, పేదల మనుగడ కు ఆదాయ బదిలీ పథకాన్ని అమలు చేయాలని సలహా ఇచ్చారు. ఇప్పటికే బలహీనమైన భారత ఆర్థిక వ్యవస్థపై పడిన కరోనా దెబ్బ ప్రభావాన్ని అధిగమించేందుకు ఆర్బీఐ, కేంద్రం మృదువుగా వ్యవహరించాల్సి ఉందన్నారు. చిన్న మధ్య తరహా సంస్థలతో పాటు పెద్ద సంస్థలకు బ్యాంకులు రుణాలు, ప్రోత్సాహకాల్ని అందించాలి. దరిమిలా బ్యాంకులు క్రెడిట్ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాయని చెప్పారు. ప్రపంచ దేశాల్లో ద్రవ్య సడలింపునకు ఇతర కేంద్ర బ్యాంకుల వైఖరిని ఆర్ బీఐ కూడా అనుసరించాలని తెలిపారు. మొండి రుణాల బెడద అధికంగా ఉన్నందున ఆచి తూచి వ్యవహరించాలని , తాత్కాలిక ఆదాయ మద్దతుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తొలి ప్రాధాన్యత వైద్య సదుపాయాలకు, ఆ తరువాత ఎక్కువగా ప్రభావితమైన ప్రజలకు కొన్నినెలల పాటు నగదు సాయం చేరాలి. తద్వారా అల్పాదాయ వర్గాల వారికి ఊరట లభించాలి. అలాగే అంతర్జాతీయ మార్కెట్ లో లభ్యమవుతున్న మెడికల్ వనరులను అందింపుచ్చుకోవాలన్నారు. తక్షణం మనకు దొరికిన చోట అవసరమైన అన్ని సరఫరాలను తీసుకోవాలన్నారు. ఇది స్వల్ప కాలిక అంశమేనని పేర్కొన్నారు.