మలప్పురం: కేరళలోని మలప్పురంలో మతసామరస్యం వెళ్లివిరిసింది. ముస్లింల ప్రార్థనల కోసం ఓ చర్చి గేట్లు తెరచుకున్నాయి. చర్చి ముందున్న విశాలమైన మైదానంలో ఈద్ ప్రార్థనలు చేసుకోవచ్చంటూ మంజేరి పట్టణంలో ఉన్న నికోలస్ మెమోరియల్ సీఎస్ఐ చర్చి అధికారులు ముస్లిం సోదరులను ఆహ్వానించారు. దీంతో చర్చి ఆవరణలో ప్రార్థనలు చేసేందుకు వందల సంఖ్యలో తరలివచ్చిన దృశ్యం కనువిందు చేసింది. పట్టణంలోని ముస్లింలు ఏటా స్థానిక ప్రభుత్వ పాఠశాలలోని గ్రౌండ్లో ఈద్ ప్రార్థనలు చేసుకునేవారు. అయితే లోక్సభ ఎన్నికల కారణంగా అధికారులు పాఠశాలను మూసివేశారు. దీంతో రంజాన్ ప్రార్థనలకు గేట్లు తెరవాలని నిర్ణయించిన చర్చి పెద్దలు ముస్లిం ప్రముఖులకు తెలియజేశారు.ఈ నేపథ్యంలో ఆ ప్రాంగణం మత సామరస్యానికి వేదికగా మారింది. చర్చి ఆవరణలో రంజాన్ ప్రార్థనలు చేసేందుకు వందల సంఖ్యలో ముస్లిం సోదరులు విచ్చేసిన దృశ్యం కనువిందు చేసింది. కాగా, పవిత్రమైన రోజున ముస్లిం సోదరుల ప్రార్థనలకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం తమకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని ఫాదర్ ఫ్రాన్సిస్ జాయ్ మస్లామణి అన్నారు. ముఖ్యంగా మతపరమైన ఉద్రిక్తతలతో కూడిన సమయాల్లో ప్రేమ, ఐక్యత ప్రాముఖ్యతను చాటాలని వెల్లడించారు.