న్యూ ఢిల్లీ: తప్పుదోవ పట్టించే పతంజలి ఆయుర్వేదం ప్రకటనలపై యోగా గురువు రామ్దేవ్ బాబా సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవడంతో పతంజలిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుదోవ పట్టించే సమాచారాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. పతంజలిపై కేంద్రం చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఈ క్రమంలో విచారణకు హాజరైన రామ్ దేవ్ బాబా కోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. పౌరులకు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడమే పతంజలి ఆయుర్వేదం ఉద్దేశమని న్యాయస్థానానికి వివరించారు. ఫిబ్రవరి 27న పతంజలి ఆయుర్వేదం ఔషధ చికిత్సలకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనలను నిరంతరాయంగా ప్రసారం చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. అసంతృప్తి వ్యక్తం చేస్తూ ధిక్కార చర్యలు ఎందుకు ప్రారంభించకూడదని ప్రశ్నించింది. పతంజలి సంస్థకు బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది. 2023 నవంబరులో సుప్రీంకోర్టు పతంజలి ఆయుర్వేదానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయడాన్ని ఆపాలని కోరింది. అయినప్పటికీ బాబా రామ్దేవ్, బాలకృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించి మధుమేహం, రక్తపోటు, ఉబ్బసం, కీళ్లనొప్పులు, గ్లాకోమా వంటి వాటికి శాశ్వత నివారణలు పతంజలి వద్ద ఉన్నాయని మళ్లీ తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయడం గమనార్హం.