కృష్ణా: ప్రముఖ పారిశ్రామికవేత్త జయరామ్ హత్యకేసు నిందితులను మంగళవారం సాయంత్రం పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. రాకేష్రెడ్డి, వాచ్మెన్ శ్రీనివాస్ను మీడియా ఎదుట హాజరుపర్చారు. ఈ సందర్భంగా హత్యాకేసు వివరాలను ఎస్పీ త్రిపాఠి మీడియాకు వివరించారు. రాకేష్రెడ్డి దగ్గర జయరామ్ రూ. 4 కోట్లు అప్పు తీసుకున్నారని చెప్పారు. డబ్బు తిరిగి ఇవ్వాలని జయరామ్ని రాకేష్ అడిగారని.. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరగడంతో రాకేష్ రెడ్డి, జయరామ్పై దాడి చేసి హత్య చేశారని ఎస్పీ తెలిపారు. సెల్ఫోన్ నెంబర్ల ఆధారంగా నిందితుల్ని పట్టుకున్నామని ఆయన తెలిపారు. టెక్రాన్ సంస్థలో సమస్య వచ్చినప్పుడు… జయరామ్కు రాకేష్ పరిచయం అయ్యారని ఎస్పీ చెప్పారు. రాకేష్రెడ్డి హైదరాబాద్లో దందాలు చేసేవారని ఎస్పీ త్రిపాఠి తెలిపారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లో ఉన్న ఇంటికి రావాలని… రాకేష్రెడ్డి.. జయరామ్ని పిలిపించారని, ఇంటికి వచ్చిన జయరామ్ను ఆ రోజు రాత్రంతా కొట్టి హింసించారని ఎస్పీ చెప్పారు. నల్లకుంట సీఐ శ్రీనివాసరావు, ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డితో… నిందితులు ఫోన్లో టచ్లో ఉన్నారన్నారు. గతంలో రాకేష్రెడ్డిపై పలు కేసులు ఉన్నాయని, జైలుకు కూడా వెళ్లారని ఎస్పీ చెప్పారు. ఈ కేసులో శిఖాచౌదరిని కూడా ప్రశ్నించినట్లు ఎస్పీ చెప్పారు. శిఖాచౌదరి, రాకేష్రెడ్డి మధ్య కొంతకాలంగా సంబంధాలు లేవని ఎస్పీ స్పష్టం చేశారు.