హైదరాబాద్ : ప్రధాని మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షాలను నటుడు రజనీకాంత్ కృష్ణార్జులతో పోల్చడంపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. వాళ్లిద్దరూ కృష్ణార్జునులైతే పాండవులెవరు, కౌరవులెవరు అని ప్రశ్నించారు. దేశంలో మరో మహా భారతం జరగాలని మీరు కోరుకుంటున్నారా అని విమర్శించారు. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడుతూ మోదీ, షాలను కృష్ణార్జునులుగా పోల్చిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమంలో అమిత్ షాతో పాటు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. రజనీ వ్యాఖ్యలపై ఇదివరకే కాంగ్రెస్ మండిపడింది. మహా భారతాన్ని మరోసారి చదువుకోవాలంటూ చురకలు అంటించింది.