విశాఖ పట్టణం: కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని పలుచోట్ల శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం, కర్ణాటక నుంచి విదర్భ, చత్తీస్గఢ్ మీదుగా ఒడిశా వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభా వంతో వచ్చే 24 గంటల్లో కోస్తాతోపాటు రాయలసీమలో అక్కడక్కడ వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, శనివారం వరరూ రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బంగాళాఖాతంలో తూర్పు గాలులు బలంగా వీస్తుండడంతో గురువారం కోస్తాలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. శృంగవరపు కోటలో 9, పార్వతీపురంలో 8, పొన్నూరు, మంగళ గిరి, గొలుగొండ్లలో 6 సెం.మీ వర్షపాతం నమోదైంది. విశాఖపట్టణంలోనూ గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది.