హోసూరు : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ తమిళనాడు-కర్ణాటక సరిహద్దు అత్తిపల్లి వద్ద వివిధ కన్నడ సంఘాలు ఆందోళన నిర్వహించాయి. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన వ్యవసాయ బిల్లు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని, ఈ బిల్లు కార్పొరేట్లకు అనుకూలంగా ఉందని ఆరోపిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. కృష్ణగిరి జిల్లాలో డిఎంకె, సీపీఐ, సీపీఎం తదితర పార్టీలకు చెందిన వారు ఆందోళన నిర్వహించారు. డిఎంకె పార్టీ జిల్లా కార్యదర్శి వై.ప్రకాష్ అధ్యక్షతన తళిలో కార్యకర్తలు ఆందోళన నిర్వహించగా,
హోసూరు ఎమ్మెల్యే సత్య అధ్యక్షతన హోసూరు రాంనగర్లో డిఎంకె కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వేపనపల్లి ఎమ్మెల్యే మురుగన్ నేతృత్వంలో సూలగిరిలో డిఎంకె పార్టీ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. తమిళనాడు సరిహద్దులోని అత్తిపల్లి వద్ద కర్ణాటక రక్షణా వేదిక, కన్నడ జాగృతి వేదిక సంఘాలకు చెందిన కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ తీరును ఖండించి ఆందోళన నిర్వహించారు. కన్నడ సంఘాల నాయకులు, కార్యకర్తలను అత్తిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. కన్నడ సంఘాలకు చెందిన కార్యకర్తలు సరిహద్దులో ఆందోళన నిర్వహించడం వల్ల హోసూరు-బెంగళూరు జాతీయ రహదారి అత్తిపల్లి వద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.