తన వల్ల ఓ జంట వివాహం ఆగిపోతుందని తెలిసి రాష్ట్రపతి రామనాథ కోవింద్ స్పందించిన తీరుపై సర్వత్రా ప్రశంసలు,హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కేరళకు చెందిన ఓ కుటుంబం తమ బిడ్డ ఆశ్లే హాల్ కు వివాహాన్ని తలపెట్టింది. జనవరి 7న… అంటే నేడు వివాహాన్ని కొచ్చి లోని తాజ్ హోటల్ లో కల్యాణ వేదికను నిశ్చయించుకుని, నెల రోజుల క్రితమే అడ్వాన్స్లు ఇచ్చారు.అయితే, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కేరళ పర్యటనలో భాగంగా ఇదే తాజ్ హోటల్లో బస చేయాలని భావించారు. దీంతో 5వ తేదీన వివాహం తేదీని మార్చుకోవాలని ఆశ్లే హాల్ కుటుంబీకులకు హోటల్ యాజమాన్యం సమాచారాన్ని ఇచ్చింది. దీంతో ఏం చేయాలో పాలుపోని వారు ఆవేదనలో ఉండగా, వధువు, రాష్ట్రపతి భవన్ కు ట్వీట్ చేసింది.తన వివాహం సజావుగా సాగడానికి సహాయం కావాలని కోరింది. ఈ విషయం గురించి తెలుసుకున్న రామ్ నాథ్, వెంటనే స్పందించారు. తన భద్రతా బలగాలను తగ్గించాలని స్థానిక అధికారులను కోరారు. దీంతో అధికారులు స్థానిక పరిస్థితులను విశ్లేషించి, అటు రాష్ట్రపతికి బసను, ఇటు పెళ్లికి ఏర్పాట్లనూ చేశారు. కాగా, నిన్న మధ్యాహ్నం హోటల్ కు వచ్చిన రాష్ట్రపతి, నేడు లక్షద్వీప్ కు వెళ్లనుండగా, ఆశ్లే హాల్ వివాహం కూడా నేడు జరగనుంది.